వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైకాపా శాసనసభ్యులు స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరారు. శనివారం నాడు వారు అసెంబ్లీలో స్పీకర్ కోడెలతో సమావేశమై ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు కర్నూలు జిల్లాలో ఫ్యాన్ రెక్కలు ఒక్కొక్కటి ఊడిపోతున్నాయి. మొన్న భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, నిన్న మణిగాంధీ, టిడిపీలో చేరగా తాజాగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి సైకిల్ ఎక్కారు. విజయవాడలో పసుపు పచ్చ కండువా వేసుకున్నారు. కర్నూలులో వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు జారిపోతున్నారు.
2014 ఎన్నికల తర్వాత కర్నూలు జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్న ఫ్యాన్ పార్టీ, ఇప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలకు చేరింది. శ్రీశైలం నియోజకవర్గ వైసిపి ఎమ్ఎల్ఎ, జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర రెడ్డి వైసిపీని వీడి చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
ఇందుకోసం నియోజకవర్గం నుంచి వైసిపి నాయకులు కార్యకర్తలు బుడ్డా అభిమానులు దాదాపు 30 బస్సుల్లో సుమారు 1800 వందల మందితో విజయవాడకు చేరారు. గత ఆదివారం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన బుడ్డా.. వారి నిర్ణయం మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టి మారుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ కాగా ఈ సంఖ్య మరికాస్త పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీనితో జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీస్థాయి నేతలను కలిసి సమస్యను ఏకరవు పెట్టుకున్నారు. కొందరైతే, తెలంగాణలో కూడా ఇలాగే జరుగుతుంది కదా అని వ్యాఖ్యానించడం జగన్ మోహన్ రెడ్డికి మింగుడుపడే విషయం కాదు.