విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూం ఎదురుగా వున్న వైఎస్ ఆర్ విగ్రహాన్ని తొలగించేందుకు కార్పోరేషన్ అధికారులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. అర్థరాత్రి సమయంలో భారీ యంత్రాలను అధికారులు విగ్రహం వద్దకు తరలించారు. సమాచారం తెలియడంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు విగ్రహం వద్దకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, జోగి రమేష్ల ఆధ్వర్యంలో విగ్రహం తొలగింపు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ట్రాఫిక్కు ఎటువంటి ఆటంకం లేకపోయినా వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడానికి అధికారులు ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోను విగ్రహం జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా అభిమానులు వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వంగవీటి రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. మరోవైపు ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులు వాహనాలతో తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా తరలి వచ్చిన పోలీసులు ఆందోళన నిర్వహిస్తున్న వంగవీటి రాధా, జోగి రమేష్లతో పాటు పలువురు కార్పోరేటర్లను కూడా అరెస్టు చేశారు. బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అరెస్టు చేసిన నాయకులను పోలీసు స్టేషనులకు తరలించారు.