వైఎస్ఆర్ జలకళ పథకాన్ని సిఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రారంభించారు. 2 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లను ప్రభుత్వం వేయనుంది. వైఎస్ఆర్ జలకళ కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లను కేటాయించింది.
ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన మరో హామీకి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల బోర్లను తవ్విస్తామన్నారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నామని వెల్లడించారు. రూ.2,340 కోట్ల ఖర్చుతో చిన్న, సన్నకారు రైతులకు బోర్లను వేయించడంతోపాటు మోటార్లను బిగిస్తామన్నారు.
ఫీడర్ల కోసం రూ.1700 కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు. ఒకసారి బోరు ఫెయిల్ అయితే మరోసారి కూడా బోరు వేస్తామని చెప్పారు. 163 బోర్లతో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక బోర్ రిగ్గును ఏర్పాటు చేస్తామన్నారు.
భూగర్భ శాఖ రిపోర్టు ప్రకారం రైతుల పొలాల్లో బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ సరఫరాలో లోపాలుంటే.. రైతులకు ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా.. లోడ్ తెలుసుకునేందుకు మీటర్లను బిగిస్తామన్నారు.
మీటర్లు బిగించడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని స్పష్టం చేశారు. నాణ్యమైన ఉచిత విద్యుత్ను రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతుల ఖాతాలకు నేరుగా డబ్బులను వేస్తామని సిఎం జగన్ పేర్కొన్నారు.