Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చనిపోయిందని ఆటో ట్రాలీలో పడేస్తే లేచి కూర్చొన్న మహిళ.. ఎక్కడ?

చనిపోయిందని ఆటో ట్రాలీలో పడేస్తే లేచి కూర్చొన్న మహిళ.. ఎక్కడ?
, శనివారం, 10 అక్టోబరు 2015 (13:16 IST)
కొన్ని సంఘటనలు వినేందుకే కాదు.. చూసేందుకు సైతం నమ్మశక్యంగా ఉండవు. ఇలాంటి సంఘటన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో జరిగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి.. చనిపోయిందని నిర్ధారించుకుని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆటోట్రాలీలో వేయగానే లేచి కూర్చొంది. దీంతో పోలీసులతో పాటు ఆమె తరపు బంధువులు కూడా అవాక్కయ్యారు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పశ్చిమగోదావరి జిల్లా ఇప్పలపాడు గ్రామానికి చెందిన సత్తిబాబు కుమార్తె పడాల కనకదుర్గ (22)కు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. యేడాది గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో కనకదుర్గను భర్త వదిలేశాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు భారం కాకూడదని మూడేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చింది. 
 
గండి మైసమ్మ ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని స్థానికంగా ఉండే ఓ టైలరింగ్ దుకాణంలో పని చేస్తోంది. భర్త దూరం కావడం.. ఒంటరితనం భరించలేక గురువారం ఉదయం 10 గంటలకు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. అయితే, రాత్రైనా కనకదుర్గ గది నుంచి బయటకు రాకపోవడం, గది నుంచి పెద్దగా టీవీసౌండ్ మాత్రమే వస్తుండటంతో స్థానికులు తలుపులు తట్టినా ఎలాంటి శబ్ధం లేదు. 
 
దీంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల వచ్చి తలుపులు బద్దలకొట్టి చూడగా కనకదుర్గ నిర్జీవంగా పడి ఉంది. చనిపోయిందని భావించి గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ఆటోట్రాలీలో కనకదుర్గను పడుకోబెట్టారు. ఇంతలో ఒక్కసారిగా లేచి కూర్చోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జీవితంపై విరక్తిలో నిద్రమాత్రలు మింగానని పోలీసులకు చెప్పింది. పూర్తి వివరాలు వెల్లడించేందుకు మాత్రం ఆమె నిరాకరించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu