Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యాచారం చేసి జైలుకెళ్లిన భర్త.. పరువు కోసం పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

అత్యాచారం చేసి జైలుకెళ్లిన భర్త.. పరువు కోసం పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
, గురువారం, 26 నవంబరు 2015 (19:39 IST)
ప్రాణం కంటే పరవుప్రతిష్టలే ఆ తల్లికి గొప్పగా కనిపించాయి. బిడ్డలపై మమకారం కంటే భర్త మరొకరికి చేసిన అపకారమే మనసును తీవ్రంగా కుంగదీసింది. భర్త చేసిన దారుణం ఓవైపు దహించివేస్తుంటే మరోవైపు ఇరుగు పొరుగువారి సూటిపోటి మాటలు బాణాలుగా ఆమె హృదయాన్ని ఛిద్రం చేశాయి. మాటల తూటాలకు తాళలేక... సమాజంలో సాంత్వన పొందలేక నిండు నూరేళ్ల బతుకును నులిమేసుకుంది. భర్త పాపం పిల్లలకు అంటకూడదనుకుందో ఏమో....! లాలనగా పసివాళ్లకు విషం కలిపిన పాలిచ్చి వారిని కూడా పరలోకానికి పంపే ప్రయత్నంచేసింది. ఆ తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఓ కామాంధుడు చేసిన దారుణం తల్లీ బిడ్డల ప్రాణం తీయగా మరో బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ హృదయవిదారక సంఘటన అనంతపూర్ జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. నార్పల మండలంలోని బండ్లపల్లి గ్రామానికి చెందిన రామాంజినేయులు రెడ్డి కుమార్తె మాధవి (25)ని ఏడేళ్ల క్రితం ముదిగుబ్బ మండలంలోని కొడవండ్లపల్లి గ్రామానికి చెందిన కుమార్‌ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి భానుశ్రీ (5), లోకేశ్వర్‌ రెడ్డి (3) ఇనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
అయితే, భర్త కుమార్‌ రెడ్డి ఒకటిన్నర నెల కిందట కొడవండ్లపల్లి గ్రామంలోని ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. దీంతో భర్త చేసిన ఘాతుకాన్ని మాధవి జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురైంది. దీనికి తోడు కొడవండ్లపల్లి గ్రామంలో కొందరు మాధవిని అసభ్యపదజాలంతో దూషించసాగారు. దీంతో ఆమె బిడ్డలతో పుట్టింటికి చేరుకుంది. అయినా జరిగిన సంఘటన పదే పదే గుర్తుకు తెచ్చుకుని మథనపడుతూ వచ్చింది. 
 
ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చింది. అంతేకాక ఆ పిల్లల గొంతుకు తాడుతో బిగించింది. దీంతో లోకేశ్వర్‌ రెడ్డి(3) మృతి చెందగా, భానుశ్రీ స్పృహ కోల్పోయింది. ఇది గమనించని మాధవి ఇద్దరు పిల్లలు చనిపోయారని నిర్ణయించుకొని ఇంట్లోనే తానూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటికి దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వారందరినీ ఆస్పత్రికి తరలించగా, మాధవి కూడా మృతి చెందిందని, భానుశ్రీ మాత్రం ప్రాణాపాయంతో ఉన్నట్టు వైద్యులు చెప్పారు. 
 
అయితే, మాధవి చనిపోయే ముందు సూసైట్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. ఈ లేఖను చదివిన ప్రతి ఒక్కరూ కన్నీంటిపర్యంతమయ్యారు. ఇందులో... నాకు బతకాలన్న ఆశ లేదు. నిందలు మోస్తూ బతకలేను. ఒకరికి మంచి చేయకపోయినా ఫర్వాలేదు... చెడు చెయ్యకూడదు.. సభ్యసమాజం తలదించుకునేలా నా భర్త చేసిన పాపానికి తల ఎత్తుకొని ఎలా తిరిగేది. నన్ను క్షమించునాన్నా... నన్ను క్షమించు... పిల్లలను చంపి నేను చనిపోతున్నాను. తను(నా భర్త) చేసిన అప్పులు కూడా మీరే కట్టండి అంటూ సూసైడ్‌నోట్‌ రాసింది. 

Share this Story:

Follow Webdunia telugu