భర్త చనిపోయాడు.. అత్తమామలు గెంటేశారు.. బిడ్డతో పాటు వివాహిత మౌనపోరాటం..!
ఓ వివాహిత పట్ల ఆమె అత్తమామలు దారుణంగా వ్యవహరించారు. భర్త అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవడంతో.. తనను.. తన బిడ్డను అక్కున చేర్చుకుంటారనుకున్న అత్తమామలు నిర్ధాక్షిణ్యంగా బయటికి గెంటేశారు.
ఓ వివాహిత పట్ల ఆమె అత్తమామలు దారుణంగా వ్యవహరించారు. భర్త అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవడంతో.. తనను.. తన బిడ్డను అక్కున చేర్చుకుంటారనుకున్న అత్తమామలు నిర్ధాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. పెళ్ళి సమయంలో తెచ్చిన రూ.5 లక్షరూపాయల్ని, కట్నం కానుకలను మింగేసి.. కొడుకు పోయాక కోడలిని, మనవడిని ఇంటి నుంచి గెంటేశారు. కానీ ఆమె బిడ్డతో కలిసి ఇంటి తలుపు వద్దే న్యాయం కోసం పోరాడుతోంది. ఈ ఘటన బాపట్ల మండలం భీమావారిపాలెంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామానికి కావ్యను, బాపట్ల పట్టణం భీమావారిపాలెం ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్.. తిరుపతి నాయుడుకిచ్చి 2011 సంవత్సరం మార్చి 13వ తేదీన పెళ్లి చేశారు. వివాహ సమయంలో వారికి కావ్య తల్లిదండ్రులు రూ. 5 లక్షల నగదు, 4 ఎకరాల పొలాన్ని కట్నంగా ఇచ్చారు. వారికి ఫిబ్రవరి 12- 2012 సంవత్సరంలో అక్షిత్ జన్మించాడు.
అయితే తిరుపతి నాయుడుకి అనారోగ్యం రావడంతో 21 ఫిబ్రవరి 2014న హైదరాబాద్లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుపతి నాయుడు మృతి చెందిన మూడు నెలలకు కావ్య పుట్టింటికి నిద్రలకు వెళ్ళింది. నిద్రలకు వెళ్ళిన కోడలు అలాగే వెళ్ళిపోతుందనుకున్న అత్తమామలు.. కావ్య తల్లిదండ్రులు వృద్ధులై అనారోగ్యం పాలవటంతో కావ్య తన కుమారుడితో కలిసి భర్తింటికి రావడంతో షాక్ అయ్యారు.
ఇంకా ఆమెను ఇంట్లోకి రానివ్వడానికి నిరాకరించారు. అత్తమామలు బయటికి నెట్టేసినా, ఏం చేయాలో పాలుపోని కావ్య అప్పటి నుంచి ఇంటి గుమ్మం వద్దే చిన్న చాప వేసుకొని బిడ్డతో మౌనపోరాటం చేస్తోంది. తనకు తన బిడ్డకు న్యాయం చేసేంతవరకు ఇక్కడ నుంచి కాలు కదపబోనని కన్నీటితో పోరాటానికి దిగింది. తనకు న్యాయం జరగాలని తనకు సహకరించాల్సిందిగా స్థానికులను కోరింది. ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోవాలని కావ్య విజ్ఞప్తి చేస్తోంది.