తమ అక్రమ సంబంధానికి అడ్డు చెబుతున్నాడని ఒక మహిళ ప్రియుడితో కలిసి భర్తనే హత్యచేసింది. ఈ సంఘటన నందిగామ మండలంలోని అడవిరావులపాడు గ్రామంలో సోమవారం అర్థరాత్రి జరిగింది.
పోలీసుల సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన మార్కపూడి ఆశీర్వాదం (30)కి ఆరేళ్ల క్రితం చందర్లపాడు మండలం తుర్లపాడుకు చెందిన వేల్పుల ప్రమీలతో వివాహం జరిగింది. వీరికి మహేశ్వరి (5), సిరిమల్లి (2) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అయితే గత కొంత కాలంగా ప్రమీల అదే గ్రామానికి చెందిన వినోద్ అనే యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసి ఆశీర్వాదం ఆమెను మందలించాడు. ఆశీర్వాదం బతికి ఉంటే తమకు అడ్డుగా ఉంటాడని భావించిన ప్రమీల, వినోద్లు సోమవారం అర్థరాత్రి ఊపిరి ఆడకుండా చేసి ఆశీర్వాదాన్ని దారుణంగా హత్య చేశారు.
మంగళవారం ఉదయం తమకు ఏమీ తెలియదన్నట్లు తన భర్త లేపితే లేవడం లేదంటూ చుట్టుపక్కల వారిని పిలిచి ప్రమీల చెప్పింది. వారు వచ్చి పరిశీలించగా ఆశీర్వాదం మృతి చెంది ఉన్నాడు. ఆశీర్వాదం బంధువులు ఆమెను గట్టినా నిలదీయడంతో పాటు దేహశుద్ధి చేయడంతో తాను వినోద్ కలిసి హత్య చేసినట్లు గ్రామస్థుల ముందు అంగీకరించింది.
ఆశీర్వాదం బంధువులు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో స్టేషన్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు, ఎస్ఐ తులశీరామకృష్ణలు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన జరిపారు. గ్రామస్థుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అప్పటి వరకూ గ్రామంలోనే ఉన్న మరో నిందితుడు వినోద్ పరారయ్యాడు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితురాలు ప్రమీలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఒక పక్క తండ్రి విగత జీవుడు కావడం, మరో పక్క నిందితురాలిగా తల్లి పోలీసు కస్టడీకి వెళ్లడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.