తెలంగానా రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా, భువనగిరి ఆర్పీ నగర్లోని ఓ కిరాణా దుకాణంలో ఉంచిన బాణాసంచా పేలడంతో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే సజీవ దహనంకాగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్పీ నగర్లో పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అతను తన షాపులో పెద్ద ఎత్తున దీపావళి బాణాసంచా అమ్మకానికి ఉంచాడు.
ఈ స్థితిలో దుకాణం లోపల ఎలక్ట్రీషన్ వర్క్ ఉండడంతో అదే ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్ నాగేశ్వరరావును పిలిపించాడు. అదే సమయంలో ఒక సాకెట్లో సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంది. నాగేశ్వరరావు మరమ్మతులు చేస్తుండగానే సెల్ఫోన్ బాగా వేడెక్కడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
నిప్పు రవ్వలు పడడంతో ఒక్కసారిగా బాణాసంచాకు నిప్పు అంటుకుంది. దీంతో శ్రీనివాస్ బయటకు పరుగులు తీశాడు. అయితే ఎలక్ట్రీషియన్ నాగేశ్వరరావు, బాణాసంచా కొనేందుకు వచ్చిన కళ్యాణ్, పోశెట్టి అనే వారు బయటకు వెళ్లలేకపోయారు.
బాణాసంచా పేలుడు, మంటలు ఎక్కువ కావడంతో నాగేశ్వరావు, కళ్యాణ్లు సంఘటనా స్థలంలోనే సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంతో పోశెట్టి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోశెట్టి పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.