తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ ప్రారంభమైంది. గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు సాధించిన ఘన విజయంతో ఈ ఆపరేషన్ను మళ్లీ ప్రారంభించింది. దీంతో విపక్షాలకు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు ఎమ్మెల్యేలు కారు ఎక్కబోతున్నారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఏ పార్టీకి చెందినవారు? అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు.
అయితే, తాజాగా టీఆర్ఎస్లో చేరబోయే విపక్ష ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్ పరిధికి చెందిన వారనే చర్చ పార్టీ ముఖ్యుల్లో జోరుగా సాగుతోంది. మంగళవారం లేదా బుధవారం సీఎం కేసీఆర్ను ఆయన అధికారిక నివాసంలో కలిసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
వారి చేరిక తర్వాత బుధవారం సాయంత్రం మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్లో జరిగే ఉప ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని సమాచారం. అయితే ఇద్దరు లేదా ముగ్గురు విపక్ష ఎమ్మెల్యేల చేరిక విషయాన్ని టీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యులు అధికారికంగా ధ్రువీకరించటం లేదు.