తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై శుక్రవారం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు.
తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు కూడా హాజరయ్యారు. నవంబర్ 5 నుంచి 23 వరకు తెలంగాణ బడ్జెడ్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రారంభం రోజునే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే తేదీలు దగ్గరపడుతుండడంతో సీఎం కేసీఆర్ శుక్రవారం ఆ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. కరెంట్ సమస్య, రైతుల ఆత్మహత్యలు తదితరవాటిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రజలలో నెలకొన్న ఆందోళనను తొలగించి... వారికి బరోసా కల్పించడం... ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టే విధంగా పార్టీ నేతలను సమాయత్తం చేసే పనిలో కేసీఆర్ ఉన్నారు.