నమ్మించి గొంతు కోశారు : టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల ఆవేదన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తనకు పదవి దక్కకపోవడంపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఎంపీగా ఉన్న తనను ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారని,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తనకు పదవి దక్కకపోవడంపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఎంపీగా ఉన్న తనను ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారని, కన్నా లక్ష్మీనారాయణపై గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు గతంలో హామీ ఇచ్చారన్నారు.
కానీ, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, తనను నమ్మించి గొంతుకోశారని ఆయన వాపోయారు. పార్టీలు మారిన వారికి, నాలుగు సార్లు ఓడిపోయిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న తమను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేబినెట్లోకి తీసుకోవడాన్ని మోదుగుల తీవ్రంగా తప్పుబట్టారు.
ఏపీ మంత్రి వర్గ విస్తరణలో తనకు స్థానం కల్పించకపోవడంపై ఎమ్మెల్యే బోండా ఉమ కినుక వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను టీడీపీ నేతలు బుజ్జగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. మంత్రి వర్గంలో స్థానం దక్కనందుకు తాను చాలా బాధపడ్డానని, తనకు మంత్రి పదవి రాలేదని నిరాశ చెందిన 13 జిల్లాల కార్యకర్తలు బాధపడ్డారని అన్నారు.
చంద్రబాబు తనకు ఫోన్ చేస్తే వెళ్లి కలిశానని, కొన్ని సమీకరణల్లో భాగంగా స్థానం కల్పించ లేకపోయామని చెప్పారని అన్నారు. పాత, కొత్త కలయికలతో మంత్రి వర్గ విస్తరణ జరిగిందని, కొత్త వారికి చోటు కోసం తన లాంటి వారు కొందరు త్యాగం చేశారని, భవిష్యత్తులో తనకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నానని బోండా ఉమ అన్నారు.