కర్ణాటక రాజధాని బెంగళూరులో టాంజానియా యువతిపై దాడి చేసి వివస్త్రను చేసిన ఘటన మరవక ముందే.. వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని వర్థన్నపేట మండలం డీసీ తండాలో ఓ మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన ఘటన తలదించుకునేలా చేసింది. ఈ ప్రాంతానికి చెందిన రవి అనే వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారు. వారిలో రెండో భార్య అనిత పట్ల బంధువులు దారుణంగా ప్రవర్తించారు.
రవి మొదటి భార్య బంధువులు రవి రెండో భార్యను చిత్ర హింసలకు గురిచేసి అమానుషంగా ప్రవర్తించారు. ఆమె ఒంటిపై కర్రలు, ఇనుప చువ్వలతో కాల్చారు. అంతటితో ఆగకుండా వివస్త్రను చేసి తండాలో ఊరేగించారు. ఈ సంఘటన తెలిసిన కొంతమంది స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చి బాధితురాలు అనితను ఆసుపత్రికి తరలించారు.
ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగించారు. మొదటి భార్య ఉండగానే రెండో పెళ్ళి చేసుకోవడం, అందుకు ఆ మహిళ అంగీకరించడంతోనే తొలి భార్య బంధువులు ఆమెపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది.