తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీ కవిత కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భజన చేస్తున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో చేరాలన్న ప్రణాళికతోనే ఆమె నిత్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భజన చేస్తున్నారన్నారు.
రైల్వే మంత్రి సురేష్ ప్రభు లోక్సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో తెలంగాణకు కొంతమేర న్యాయమే జరిగిందని కవిత వ్యాఖ్యానిస్తున్నారని, ఆ మేలు ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు న్యాయం చేయడంతో తెరాస ఎంపీలు విఫలమయ్యారన్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపాలని షబ్బీర్ డిమాండ్ చేశారు.