చెడు తిరుగుళ్లు తిరుగుతూ.. నిత్యం వేధిస్తూ వస్తున్న తన భర్తను మందలించి బుద్ధి చెప్పాలని స్థానిక కౌన్సిలర్ను ఓ మహిళ తన ఇంటికి పిలిచింది. దీంతో ఇంటికి వచ్చిన ఆ కౌన్సిలర్.. భర్తకు బుద్ధి చెప్పడం అటుంచి.. ఆ మహిళనే పెళ్లాడతాననే ప్రతిపాదన చేశాడు. దీంతో ఆ మహిళ విస్తుపోవాల్సి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో పనిచేస్తున్న ఒక మహిళకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వారి కాపురంలో ఐదునెలలుగా కలతలు ఏర్పడ్డాయి. దీంతో ఆమె.. పెద్ద మనిషి కదా అనే ఉద్దేశంతో వార్డు కౌన్సిలర్ వద్దకు వెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని కోరింది. భర్తకు కాస్త భయం చెప్పాలని అడిగింది.
కానీ.. ఆ కౌన్సిలర్ కన్ను ఆమెపై పడింది. ఆమె భర్తపై దాడి చేయించి బంధువులను బెదిరిస్తున్నాడని.. ఆ మహిళను తానే వివాహం చేసుకుంటానని చెబుతున్నాడని ఆమె తరపు బంధువులు చెబుతున్నారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు.