వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి గట్టి షాక్ ఇవ్వనున్నారు. రాజ్యసభ టిక్కెట్ ఆశించి భంగపడిన మైసూరా రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేయాలన్న తలంపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన వైకాపాలో చేరారు. పార్టీ వ్యవహారాలతో పాటు అక్రమాస్తుల కేసులోనూ ఆయన జగన్కు పలు సలహాలు, సూచనలు చేశారు. అంతేకాకుండా, కడప జిల్లాలోనే కాక ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కూడా సీనియర్ రాజకీయవేత్తగా మైసూరా రెడ్డి ఎదిగారు. ఈయన.. వైకాపాకు క్రమంగా దూరమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్, టీడీపీల్లో ఉన్న మైసూరా... భవిష్యత్తులో రాజ్యసభకు పంపుతామన్న జగన్ హామీతోనే వైకాపాలో చేరారని అపుడు వార్తలు వినిపించాయి. అయితే, ఇపుడు ఆ పార్టీ తరపున రాజ్యసభకు విజయసాయిరెడ్డిని ఎంపిక చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మైసూరా, త్వరలోనే జగన్ కు ఝలక్ ఇస్తారన్న వార్తలు జోరందుకున్నాయి.