సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య సీట్లు అన్నీ భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఈ సీట్లను వెంటనే భర్తీ చేయాలని వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిమాండ్తోనే వారు మంగళవారం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఎదుట ఆందోళన కూడా చేశారు. మొత్తం సీట్లు భర్తీ చేయకపోతే కౌన్సెలింగ్ నిలిపివేయాలని, సీట్లు భర్తీ చేయని వైద్య కళాశాలల గుర్తింపు వెంటనే రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యాలు చేసిన తప్పులకు విద్యార్థులు బలి కావాలా అంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఖాళీ సీట్లను భర్తీ చేసి తమ పిల్లల భవిష్యత్ను కాపాడాలని వారు మొరపెట్టుకుంటున్నారు.