Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూమా నాగిరెడ్డిపై 2 హత్యాయత్నం కేసులు!: నంద్యాలలో బంద్!

భూమా నాగిరెడ్డిపై 2 హత్యాయత్నం కేసులు!: నంద్యాలలో బంద్!
, శనివారం, 1 నవంబరు 2014 (11:18 IST)
కర్నూలు జిల్లాలో నంద్యాలలో శనివారం నాడు తెలుగుదేశం పార్టీ బంద్‌కి పిలుపునిచ్చింది. శుక్రవారం నాడు నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం కౌన్సిలర్ల మీద వైసీపీ కౌన్సిలర్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన నేపథ్యంలో నంద్యాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
కాగా నంద్యాల వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై రెండు హత్యాయత్నం కేసులతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఆయనతో పాటు మరో 20 మంది అనుచరులపై కూడా హత్యాయత్నం, దాడి కేసులు నమోదయ్యాయి. దీంతో, నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 
 
అరెస్ట్ భయంతో భూమా నాగిరెడ్డి తన గన్ మెన్లను సైతం వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. భూమా నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరో వైపు భూమా ప్రధాన అనుచరుడు సుబ్బారెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైకాపా వర్గీయుల మధ్య గొడవ జరిగింది. నంద్యాలలో ఆక్రమణల తొలగింపు అంశంపై రెండు పార్టీల మధ్య వివాదం తలెత్తింది.
 
ఈ క్రమంలో, మున్సిపల్ వైస్ ఛైర్మన్ విజయకుమార్ పై ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనుచరులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో టీడీపీ కౌన్సిలర్లుకు, సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. భూమా సమక్షంలోనే ఈ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం.
 
ఈ నేపథ్యంలో, తమ కౌన్సిలర్లపై దాడిని ఖండిస్తూ టీడీపీ శనివారం నంద్యాల బంద్‌కు పిలుపునిచ్చింది. టీడీపీ శ్రేణుల పిలుపుతో నంద్యాలలో బంద్ కొనసాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu