నిరంతర శ్రామికుడిలా టీడీపీ కోసం పని చేస్తానని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తెలిపారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితుల ప్రతినిధిగా టీడీపీలో చేరానన్నారు. తనను దళితులే టీడీపీలో చేరమని చెప్పారన్నారు.
పార్టీ అధినేతతో భేటీ సందర్భంగా సరైన చోట సరైన వ్యక్తి చేరారని బాబు పేర్కొన్నారన్నారు. అవినీతి, అక్రమాలను మౌనంగా భరించిన తాను, ఇకపై అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పని చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో దళితుల పాత్ర ఉండాలనే తాను టీడీపీలో చేరానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుతో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటానని వెల్లడించారు.