పరువు హత్యలు మన రాష్ట్రంలోనూ పెరిగిపోతున్నాయి. ప్రేమించిన పాపానికి తల్లిదండ్రులే కన్నకూతుర్ని గొంతు నులిమి హత్య చేశారు. ఈ ఘటన కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలుకా తమటంపల్లిలో చోటుచేసుకుంది. తక్కువ కులానికి చెందిన యువకుడిని ప్రేమించిని పాపానికి సమాజంలో తమ పరువును కాపాడుకునేందుకు కన్నవాళ్లే కాలయముళ్లుగా మారిపోయారు.
వివరాల్లోకి వెళితే.. తమటంపల్లికి చెందిన ప్రియారెడ్డి (17) అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నకూతురిని వద్దని వారించారు. అయితే దొంగచాటుగా ప్రియుడిని కలిసేందుకు వెళ్ళిన ప్రియారెడ్డి.. అతనితోనే పారిపోతుందనే భయంతో తండ్రి బైరవరెడ్డి, తల్లి, సోదరుడు కలిసి ఆ యువతిని గొంతునులిమి చంపేశారని పోలీసులు తెలిపారు. ఇక నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.