తిరుపతి శేషాచల ఎన్కౌంటర్లో మరణించిన శశికుమార్ మృతదేహానికి రీ పోస్టు మార్టం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. శశికుమార్ భార్య మునియమ్మాళ్ వేసిన పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ జరిపి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
పోస్టు మార్టం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి నుంచి ముగ్గురు డాక్టర్లను ఏపీ ప్రభుత్వం పంపించాలని, అందుకు అయ్యే ఖర్చును కూడా ఆ ప్రభుత్వమే భరించాలని తెలిపింది. తమిళనాడులో వారికి భద్రత కల్పించే బాధ్యత తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని ర్యాలీలు, బంద్లు వంటివి చేయరాదని కూడా హైకోర్టు పేర్కొంది.
దీనికి సంబంధించిన కాపీని తమిళనాడు హైకోర్టు ద్వారా అందజేయాలని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక సీల్డ్కవర్లో కోర్టుకు అందజేయాలని అలాగే ముగ్గురు వైద్యులు కోర్టుకు హాజరై పోస్టుమార్టం వివరాలను వెల్లడించాలని కోర్టు పేర్కొంది. రీపోస్టుమార్టం ఖర్చులను ఏపీ ప్రభుత్వం భరించాలని చెప్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.