నవంబర్ ఒకటో తేదీ నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి. హెల్మెట్ వాడకాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో రవాణా శాఖ పనులు మొదలెట్టింది. గుంటూరులోని రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను పరిశీలించిన అనంతరం రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. నవంబర్ 1 నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి అన్నారు. హెల్మెట్ ధరించండి.. మీ ప్రాణాలు కాపాడుకోండి అన్న నినాదాలతో రూపొందించిన ఫ్లెక్సీలను కూడా ఆవిష్కరించారు.
రవాణా శాఖలో ఏజెంట్ల వ్యవస్థను పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు కఠిన చర్యలు చేపట్టామన్నారు. దరఖాస్తులు ఇంగ్లీష్లో మాత్రమే కాకుండా తెలుగులోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గుంటూరు రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లు భేషుగ్గా పని చేస్తున్నాయన్నారు. అలాగే వాహన తనీఖీ అధికారులకు త్వరలోనే టాబ్లెట్స్, కెమెరాలు అందిస్తామన్నారు. ఏడాది చివరి నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు.