నాన్న ఇంటికి రాగానే గట్టిగా హత్తుకుంది.. తండ్రేమో గోడకేసి కొట్టి చంపాడు... సునీక్ష మృతికేసు మిస్టరీ వీడింది!
కన్న కుమార్తె పేరు మీద ఉన్న డబ్బును, ఆస్థిపై కన్నేసిన ఓ కసాయి తండ్రి.. ఆ చిట్టితల్లిని ఏమాత్రం కనికరం లేకుండా హత్య చేశాడు. అదీ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఐదు నెలలకే ఆ చిన్నారిని కూడా తండ్రి కాటికి పంపిం
కన్న కుమార్తె పేరు మీద ఉన్న డబ్బును, ఆస్థిపై కన్నేసిన ఓ కసాయి తండ్రి.. ఆ చిట్టితల్లిని ఏమాత్రం కనికరం లేకుండా హత్య చేశాడు. అదీ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఐదు నెలలకే ఆ చిన్నారిని కూడా తండ్రి కాటికి పంపించాడు. దీంతో స్థానిక సంపత్నగర్లో చోటుచేసుకున్న చిన్నారి సునీక్ష అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. చిన్నారి తండ్రి, సవతి తల్లిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
సంపత్ నగర్కు చెందిన ఐదేళ్ళ చిన్నారి సునీక్ష అనుమానాస్పదంగా ఇటీవల మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ కేసు మిస్టరీ వీడింది. కన్నతండ్రి అశోక్ డబ్బు, ప్లాట్ కోసం హత్య చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అశోక్తోపాటు అతడికి సహకరించిన రెండో భార్య లక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి డీఎస్పీ రమణమూర్తి, సీఐ నాగరాజారావు వివరాలను తెలియజేశారు.
ఈ నెల 15న మధ్యాహ్నం అశోక్ హడావుడిగా పోలీసుస్టేషన్కు వచ్చి తన కూతురు సునీక్ష మృతి చెందిందని ఫిర్యాదు చేశాడు. సీఐ నాగరాజారావు సిబ్బందితో కలిసి సంపత్నగర్లోని అశోక్ ఇంటికి వెళ్లి చిన్నారి మృతదేహాన్ని పరిశీలించినట్టు చెప్పారు. చిన్నారి ముఖం, గొంతుపై గాయాలు ఉన్నాయి. ఇవి ఎలా అయ్యాయని ప్రశ్నిస్తే రెండు రోజుల క్రితం సునీక్ష స్కూల్లో కింద పడిందని తెలిపారు. అనుమానం వచ్చిన సీఐ సునీక్ష మృత దేహాన్ని పోస్టుమార్టానికి పంపారు.
పోస్టుమార్టంలో సునీక్ష హత్యకు గురైందని, గొంతు నులమడంతోపాటు తీవ్రంగా కొట్టడం వల్లే మృతి చెందిందని, సునీక్ష కపాలానికి తీవ్ర గాయాలున్నాయని పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. సునీక్ష మృతి చెందిన సమయం 5 నుంచి 7 గంటల మధ్య అయితే ఫిర్యాదు చేసింది 12 గంటల తర్వాత కావడంతో పోలీసులకు తండ్రి అశోక్, ఆయన రెండో భార్య లక్ష్మిపై అనుమానం వచ్చింది. వీరిని తమ ఆధీనంలోకి తీసుకుని విచారిస్తే నిజాలను వెల్లడించినట్టు తెలిపారు. పాప పేరుమీద ఉన్న డబ్బు, ఆస్తి కోసమే హత్య చేసినట్టు తెలిపారు.