Publish Date: Tue, 07 Apr 2026 (18:53 IST)
Updated Date: Tue, 07 Apr 2026 (18:54 IST)
మాకు తిక్కరేగితే ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయాన్ని తగలబెట్టేస్తామని మాజీ మంత్రి, వైకాపా మహిళా నేత ఆర్కే రోజా హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్ నగరంలోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైకాపా నేతలు దాడికి యత్నించిన విషయం తెల్సిందే. అలాగే, ఏపీ వ్యాప్తంగా ఆ పత్రికకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి.
ఇందులో పాల్గొన్న రోజా మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. కొత్త పలుకు పేరుతో రాధాకృష్ణ ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. వైకాపా మహిళా నేతల గురించి, నాయకుల కుటుంబ సభ్యుల గురించి తప్పుగా రాస్తే ఊరుకోబోమని అవసరమైతే ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని తగలబెడతామని హెచ్చరించారు.
మీరు తిట్టిస్తే మాకు తిట్టడం రాక కాదు. మా సంస్కారం అడ్డు వస్తోందన్నారు. మేము తిట్టడం మొదలుపెడితే మీరు రోడ్లపై తిరగలేరు అని అన్నారు. చంద్రబాబు రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతానికే ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేని వ్యక్తి అమరావతికి రూ.2 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు.