విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హాదా ఇచ్చే ప్రసక్తే లేదనీ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. అయితే, ప్రత్యేక హోదా స్థానంలో భారీగా నిధులు మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. అదేసమయంలో ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 2017 నాటికి ఆ హోదాను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ 2017 నాటికి దేశంలో ఎక్కడా ప్రత్యేక హోదా గల రాష్ట్రాలుండబోవన్నారు. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్నారు. హోదా ఇవ్వనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అన్ని రకాలుగా చేయూతనందిస్తుందని స్పష్టం చేసారు. వచ్చే సంవత్సరం ఆఖరుకల్లా ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు ఆ హోదా రద్దయిపోతుందని ఆమె జోస్యంచెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పదేపదే విమర్శించడం తగదని, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి మరిన్ని నిధులు రానున్నాయని తెలిపారు.
ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఇది ఇరు పార్టీలకు మంచిది కాదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని గగ్గోలు పెడుతున్న నేతలు... ఇప్పటివరకు ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. బీజేపీపై రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న నిధుల గురించి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.