తెలంగాణ రాష్ట్ర సమితిపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి జంప్ అయ్యే నేతల సంఖ్య పెరిగిపోతుండటంపై నారాయణ మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతున్న జంప్ జలానీలతో టీఆర్ఎస్ పడవ బరువెక్కిందని, దాంతో ఆ పార్టీ పడవ మునిగిపోయే ప్రమాదవుందని హెచ్చరించారు.
ఈ క్రమంలో టీఆర్ఎస్ పడవ మునిగిపోతుంటే జాగ్రత్త పడాలని లేకుంటే పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడక తప్పదని నారాయణ జోస్యం చెప్పారు. రాజకీయాల్లో ఉన్నవారు నిరంతరం ప్రజల మధ్య ఉండాలన్న నారాయణ, బట్ట కాల్చి ప్రజల మీద వేసి ఫాంహౌస్లో ఉండటం కేసీఆర్కే చెల్లిందని విమర్శించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాళ్లకు మొక్కడం వంటివి కాకుండా రాష్ట్రపతి సలహాలు పాటించాలని నారాయణ కోరారు.