వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారిన టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. టీడీపీ టిక్కెట్పై గెలుపొంది.. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రిగా పని చేస్తున్నారు. ఈయన మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో తనకు వెన్నుపొటు పొడిచేందుకు సొంత పార్టీ నేతలు యత్నించారని ఆయన ఆరోపించారు. మూడు రోజుల్లో ఎన్నికలనగా విషయం తెలుసుకుని, అప్పటికప్పుడు విజయం కోసం పక్కాగా స్కెచ్ వేసుకున్నానని చెప్పారు. ఈ క్రమంలో వైసీపీ సహాయం అర్థించానన్నారు.
తాను అడిగిన వెంటనే సహాయం చేసి తనను గెలిపించిన ప్రతిపక్ష నేతలను టీడీపీ కార్యకర్తలు గౌరవించాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఈ మేరకు కార్యకర్తలు నడుచుకోని పక్షంలో తానే సదరు విపక్ష సభ్యులను గౌరవించడం మొదలుపెడతానని కూడా ఆయన హెచ్చరించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను వైసీపీ సహాయం తీసుకుని విజయం సాధించానని ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం నర్సీపట్నం కార్యకర్తల సమావేశంలో భాగంగా సోమవారం క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో పెను దుమారాన్నే రేపనున్నాయి.