తెదేపా పతనానికి కౌంట్డౌన్... బాబును ఏ భాషలో తిట్టాలి : రఘువీరా రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారానికి కౌంట్డౌన్ మొదలైందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఏపీ మంత్రివర్గ విస్తరణ చేపట్టిన విషయం తెల్సిందే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారానికి కౌంట్డౌన్ మొదలైందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఏపీ మంత్రివర్గ విస్తరణ చేపట్టిన విషయం తెల్సిందే. దీనిపై రఘువీరా తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ... తాను అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన తర్వాత కూడా మైనారిటీ వర్గం నుంచి ఒక్కరికి కూడా స్థానం కల్పించలేదని దుయ్యబట్టారు. మంత్రివర్గంలో సమతుల్యత లోపించిందని, వైకాపా నుంచి వచ్చిన వారిలో నలుగురికి పదవులు ఇచ్చారని అన్నారు.
తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో మద్దతు తగ్గుతోందని అర్థం చేసుకున్న ఆయన, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ టికెట్పై పోటీ చేసి, ఆపై తెరాసలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్కు మంత్రి పదవి ఇచ్చిన సమయంలో, కేసీఆర్ను ఉచ్చరించలేని తిట్లు తిట్టిన పెద్దమనిషి చంద్రబాబు, ఇప్పుడు అదే పని చేసి, రాష్ట్ర పరువును గంగలో కలిపాడని నిప్పులు చెరిగారు. ఇప్పుడు జగన్ పార్టీ నుంచి ఫిరాయించిన వారికి పదవులు ఇచ్చి, కేసీఆర్తో సమానమైన చంద్రబాబు, తన తప్పుడు పనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.