Publish Date: Tue, 07 Apr 2026 (20:14 IST)
Updated Date: Tue, 07 Apr 2026 (20:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతి అరెస్టయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు.. తాడేపల్లి, ఉండవల్లి సహా 4 ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు.
విశాఖ ఎండాడలో లగ్జరీ ఫ్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో జీ+2 భవనంతోపాటు 770 గ్రాముల బంగారు నగలు, 3 కిలోల వెండి గుర్తించారు. అంతేకాకుండా రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు ఉన్నట్లు తేల్చారు. వీటితోపాటు ఓ కారు, ద్విచక్ర వాహనం గుర్తించారు. అక్రమాల ఆరోపణలతో 2024 జులై నుంచి 2026 మార్చి వరకు శాంతి సస్పెన్షన్లో ఉన్నారు.
కాగా, గత వైకాపా ప్రభుత్వంలో శాంతి అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వైకాపా నేత ఒకరు ఆమెకు సంపూర్ణ అండదండలు అందించడంతో ఆమె ఇష్టారీతిగా వ్యవహరించినట్టు సమాచారం. దీంతో ఆమెను కొంతకాలం పాటు సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లగా ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో అసిస్టెంట్ కమిషనరుగా నియమితులయ్యారు. ఇపుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయ్యారు.