పవన్ కళ్యాణ్ సార్... మా తండాకు రహదారిని నిర్మించండి అంటూ ఓ క్రికెటర్ అయిన అంధురాలు విజ్ఞప్తి చేశారు. ఆమె చేసిన వినతి ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు.
కాగా, ఇటీవల ప్రపంచ కప్ సాధించిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టును ఆయన మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన పవన్... ఒక్కో క్రికెటర్కు రూ.5 లక్షలు, ట్రైనర్కు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు. అలాగే మహిళా క్రికెటర్లందరికీ పట్టుచీర, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులు అందించి సత్కరించారు.
అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. మహిళా క్రికెటర్లు చెప్పిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు దీపిక, పాంగి కరుణ కుమారి ఉండటం సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ దీపిక.. సత్యసాయి జిల్లాలోని తన స్వగ్రామం హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు రహదారి సౌకర్యం చాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన క్రికెటర్ కరుణకుమారి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలన్నారు.