ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని ప్రణాళికలో స్వల్ప మార్పులు చేయాలని సింగపూర్ ప్రభుత్వానికి సూచించారు. రాజధాని ప్రధాన ప్రాంతాన్ని మిగతా నగరాలతో కలుపుతూ రోడ్లు నిర్మించాలని చంద్రబాబు సూచించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా రాజధానిపై ప్రణాళిక సిద్ధమయ్యేలా కనిపిస్తోంది.
సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన వెంట వెళ్లిన బృందానికి నూతన రాజధాని ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం వివరించింది. ఈ సమావేశానికి సింగపూర్ మంత్రులు, ప్రధాన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా, ప్రణాళికలో కొన్ని మార్పులు చేయాలని చంద్రబాబు సూచించారు.
చంద్రబాబు సూచించిన మార్పులతో మరోసారి ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం రూపొందించబోతోంది. మరో 4 లేదా 6 వారాల్లో రాజధాని ప్రణాళికపై మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. రాజధాని ప్రధాన ప్రాంతాన్ని మిగతా నగరాలతో కలుపుతూ రహదారులు నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. సోమవారం సింగపూర్ ప్రధానితో చంద్రబాబు సమావేశం కానున్నారు.