టీడీపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి హెచ్చరిక చేశారు. కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తే ఇన్చార్జ్ మంత్రులు బాధ్యత తీసుకుని సరిదిద్దాలని ఆయన సూచించారు.
సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కూటమి నేతల తీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే ఎవరు తప్పు చేసినా ఇన్ఛార్జ్ మంత్రులు కఠినంగా వ్యవహరించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుతో అన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఇన్ఛార్జి మంత్రులు ఆ బాధ్యత తీసుకుంటారన్నారు.
వైకాపా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలపై పూర్తి సాక్ష్యాలతో వీడియోలు తీయించానని కేబినెట్ సమావేశంలో పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ సందర్భంగా పవన్ పనితీరును సీఎంతోపాటు సహచర మంత్రులు ప్రశంసించారు.
ఎర్రచందనం డిపో సందర్శనపై తన అనుభవాలను పవన్ కేబినెట్ భేటీలో పంచుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనంతో పరికరాలు తయారు చేయించి విక్రయించే ప్రతిపాదనలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.