Publish Date: Fri, 06 Mar 2026 (15:45 IST)
Updated Date: Fri, 06 Mar 2026 (16:17 IST)
వైకాపా అర్థిక విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30 యేళ్లు వెనక్కి వెళ్లిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, శుక్రవారం సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై ఆయన కీలక ప్రసంగం చేశారు.
'గత ప్రభుత్వం రూ.9 లక్షల కోట్ల మేర అప్పులు మాపై ఉంచి వెళ్లింది. రూ.35 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారు. మేము రూ.25 వేల కోట్ల బిల్లులు చెల్లించాం. వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల వేల కోట్ల నిధులు నిరుపయోగమయ్యాయి' అని అన్నారు.
'జలజీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఈ పథకానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ 5 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు.
న్యాయశాఖకు కూటమి ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగా కోర్టు భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి' అని పవన్ అన్నారు. వైకాపాలోని కొందరు ఇష్టం వచ్చినట్లు తిట్టి కులం వెనుక దాక్కుంటున్నారని, ఇది వారికే చెల్లుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.