ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్ష శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఇందుకోసం అవసరమైన కోడ్ను రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, చిన్నరాజప్ప, కామినేని శ్రీనివాస్లు విడుదల చేశారు. కాకినాడ జేఎన్టీయూలో ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ సెట్కు 'జి2' కోడ్ను వీరంతా కలిసి విడుదల చేశారు.
కాగా, ఎంసెట్ పరీక్షకు 2.92లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 1.89 లక్షల మంది, మెడిసిన్ విభాగంలో 1.03 లక్షల మంది పరీక్షకు హాజరుకానున్నారు. తెలంగాణలో ఎంసెట్ కేంద్రాలకు 42 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్లో 494 కేంద్రాలు, తెలంగాణలో 52 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు వ్యవసాయ వైద్య విభాగం (మెడిసిన్) పరీక్ష జరగనున్నాయి.
ఓఎంఆర్ షీట్లు బాల్పాయింట్ పెన్తోనే పూరించాలని అధికారులు సూచించారు. ఎంసెట్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా జామర్లు ఏర్పాటు చేశారు. అలాగే, చేతికి వాచ్ కట్టుకుని వచ్చే విద్యార్థులను కూడా లోనికి అనుమతించబోరు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో గోడ గడియారం ఏర్పాటు చేశారు. మే 9న ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.