రియల్ ఎస్టేట్ని మరిపిస్తున్ననవ్యాంధ్ర... పేలవంగా అమరావతి షాపింగ్ ఫెస్టివల్
విజయవాడ : నవ్యాంధ్ర బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చేస్తున్న హడావుడి రియల్ ఎస్టేట్ వ్యాపారుల జిమ్మిక్కులను తలపిస్తోంది. ఇప్పటివరకు నవ్యాంధ్రలో కొత్త పరిశ్రమగాని, ఉపాధి మార్గంగాని అన్వేషించలేని ప్రభుత్వం కేవలం ఆర్భాటా
విజయవాడ : నవ్యాంధ్ర బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చేస్తున్న హడావుడి రియల్ ఎస్టేట్ వ్యాపారుల జిమ్మిక్కులను తలపిస్తోంది. ఇప్పటివరకు నవ్యాంధ్రలో కొత్త పరిశ్రమగాని, ఉపాధి మార్గంగాని అన్వేషించలేని ప్రభుత్వం కేవలం ఆర్భాటాలకు మాత్రం ప్రజాధనం ఖర్చు చేస్తోంది. పుష్కరాలు, అమరావతి శంకుస్థాపన ఆర్భాటాలు మొదలుకొని తాజాగా అమరావతి షాపింగ్ ఫెస్టివల్ 2016 అంటూ చేసిన హంగామా పరిశీలకులకు నవ్వు తెప్పించింది.
దసరా సందర్భంగా విజయవాడలో షాపింగ్ ఫెస్టివల్ అని ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి, స్వరాజ్ మైదాన్లో ఏర్పాటు చేసింది. రియల్ ఎస్టేట్ మేళా తరహాలో మ్యూజికల్ నైట్లు, షాపింగులు ఏర్పాటు చేసి విజయవాడ నగర ప్రజల్ని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. దసరా సరదా అంటూ ప్రభుత్వం చేసిన అమరావతి ఫెస్టివల్ పేలవంగా సాగింది. ప్రభుత్వ పెట్టే ఖర్చు, ఆర్భాటం ఎక్కువ... ఫలితం తక్కువగా మారింది. లక్షలు పోసి బాబా సైగల్ వంటి సింగర్లను, టీవీ యాంకర్లను తెప్పించి మ్యూజికల్ నైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఇపుడు ఏమొచ్చిందని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఈ దుబారా ఖర్చు కన్నా... విజ్ఞానవంతమైన కార్యక్రమాలు చేపడితే, బాగుండేదని అంటున్నారు. మరోపక్క ఫుడ్ ఫెస్టివల్ అంటూ, సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అంతా పేలవంగా సాగింది. భవానీపురం లోని టూరిజం ఘాట్ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేసారు. ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్ల్స్కి తొలుత రూ.40 వేలు అద్దె నిర్ణయంచి, సత్యనారాయనపురం తదితర ప్రాంతాల్లో ఫుట్పాత్ వ్యాపారులను ఈ స్టాల్స్కు తరలించారు. ఈ నెల 29 వరకు స్టాల్ నిర్వహించాలని లేదంటే ఫుట్పాత్ వ్యాపారాలు చెయ్యనివ్వమని అధికారులు బెదిరించారని వ్యాపారులు తెలిపారు.
ప్రభుత్వం తలపెట్టిన దసరా ఉత్సవానికి ప్రజాదరణ కొరవడి అంతా పేలవంగా సాగింది. ఇక్కడ రోజూ రూ.500 ఖర్చుఅవుతోందని, కానీ రూ.150 కూడా బేరం లేదని వ్యాపారులు వాపోయారు. ఈ విషయం కలెక్టరుకు తెలుపుకున్నామని అద్దె చెల్లించవద్దని హామీ ఇచ్చినప్పటికీ కరంట్ బిల్లు కూడా చెల్లించగలిగే వ్యాపారాలు ఇక్కడ లేవని తెలిపారు. ప్రతిరోజు తమ శ్రమ కాకుండా 400 విలువైన సామగ్రి వృధా అవుతోందని వాపోయారు. ఆహార విక్రయ స్టాల్లో ఖాళీగా వున్న వ్యాపారి ఫోటోను చూస్తే తెలుస్తుంది... అమరావతి ఫెస్టివల్ ఎంత పేలవంగా సాగిందో.