Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్ సర్కారు వైఖరిని ఎండగట్టిన ప్రరాపా

వైఎస్ సర్కారు వైఖరిని ఎండగట్టిన ప్రరాపా
, సోమవారం, 10 ఆగస్టు 2009 (09:59 IST)
File
FILE
రాష్ట్రంలోని వైఎస్ సర్కారుకు ప్రజారాజ్యం పార్టీ అనుకూలంగా వ్యవహిస్తూ వస్తుందనే అపవాదును చెరిపేసుకునే దిశగా ప్రజారాజ్యం పార్టీ అసెంబ్లీ వ్యవహరిస్తోంది. ప్రస్తుతం వాడివేడిగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆ పార్టీకి చెందిన 18 ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ఇస్తూనే.. మరోవైపు ప్రజావ్యతిరేక అంశాలపై ప్రరాపా ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విరుచుక పడుతున్నారు.

సోమవారం నాటి అసెంబ్లీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యే వంగా గీత మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో జోగుతోందని దుయ్యబట్టారు. దుర్భిక్షం కారణంగా రాష్ట్రమంతటా ప్రజలు అల్లో రామచంద్రా అంటూ బతుకు దెరువు కోసం సొంతూళ్ళను ఖాళీ చేస్తున్నారన్నారు.

మూగజీవుల పరిస్థితి దయనీంగా ఉందన్నారు. పశుగ్రాసం లభించక అనేక పశువులు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కరువుతో అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహిస్తోందన్నారు.

అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ప్రరాపా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రిగా ఉన్న వీరప్ప మొయిలీ.. కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమం అని ఎలా చెపుతారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఆపార్టీ శాసన సభ్యులు వ్యాఖ్యానించారు.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం వల్లే మొయిలీ ఈ విధంగా వ్యాఖ్యానించారని ఆమె ఆరోపించారు. అయితే, మన రాష్ట్ర పాలకులు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, సొంత లాభాలను చూసుకుంటున్నారని ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు.

Share this Story:

Follow Webdunia telugu