వైఎస్ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు వివరాలను తాము వెబ్సైట్లో పొందుపరుస్తామని డీజీసీఏ అధికారి త్యాగి తెలిపారు. ప్రమాదంపై ప్రజలకున్న సందేహాలను నివారించేందుకు తాము వెబ్సైట్లో ఉంచాలని అనుకున్నామని ఆయన అన్నారు.
ప్రమాదానికి సంబంధించి ముఖ్యమైన పరికరాలు పరిశీలించాకే నివేదిక అందజేస్తామని ఈ బృందం ప్రకటించింది. నేటినుంచే విచారణ ప్రారంభించామని, ఇప్పటికే తమవద్ద కొంత సమాచారం ఉందని వారు పేర్కొన్నారు.
సంఘటనాస్థలాన్ని పరిశీలిస్తే మరింత సమాచారం లభ్యం కావచ్చని తాము భావిస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా ఇలాంటి కేసుల విచారణ మూడేళ్లపాటు కొనసాగుతుందని, ముఖ్యమైన కేసు కావడంతో వీలైనంత త్వరగా విచారణ పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. కేసు పురోగతిని తాము వెబ్సైట్లో ఉంచేందుకు కసరత్తు చేస్తామని ఆయన వివరించారు.
వైఎస్ ప్రజాదరణగల నాయకుడైనందున ఆయన మృతికి సంబంధించిన అన్ని వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.