మిస్టరీగా జగన్మోహన్ హత్య...జడ్చర్ల ఎమ్మెల్యే పనేనా?
, శుక్రవారం, 19 జులై 2013 (11:28 IST)
జడ్చర్లలో జరిగిన దారుణ హత్యపై హతుని భార్య ఎర్ర అర్షిత స్పందించారు. తన భర్త ఎర్ర జగన్ మోహన్ను జడ్చర్ల ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎర్ర శేఖరే హత్య చేయించారని ఆమె ఆరోపించారు. బుధవారం రాత్రి జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సోదరుడు ఎర్ర జగన్ మోహన్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. జగన్మోహన్ మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత అంత్యక్రియలకు హైదరాబాద్ తరలించారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బుధవారం నుండి కనపడటం లేదని పోలీసులు తెలిపారు. గన్మెన్ను వదిలిపెట్టి బెంగళూరుకు వెళ్లారని కొందరు అంటుండగా, డిఐజి ముందు లొంగిపోయినట్లు సమాచారం. జగన్మోహన్ ఊరికి వచ్చేవాడు కాదు. జగన్మోహన్ అన్నదమ్ములు ఐదుగురు. వీరిలో ఎర్రసత్యం 18 ఏళ్ల క్రితం దుండగుల తూటాలకు బలయ్యారు. ఎర్రశేఖర్ ఎమ్మెల్యే అయ్యాక జడ్చర్లలోనే ఉంటున్నారు. మరో ముగ్గురు హైదరాబాద్లో ఉంటూ ప్రయివేటు వ్యాపారాలు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెండు మూడు నెలలకు ఒకసారి కూడా గ్రామానికి రాడు. ఎన్నికల సమయం కాబట్టి ఊరికి రావడం, ఇదే సందర్భంలో హత్య జరగడం చర్చనీయాంశమైంది.