ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరప్ప మొయిలీతో చర్చించిన పిదపే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వారసుడిని ఎంపిక చేస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారని ప్రభుత్వ సలహాదారు కేవీపీ.రామచంద్రరావు వెల్లడించారు. అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన మంగళవారం సాయంత్రం సోనియాతో ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్తో కలిసి భేటీ అయ్యారు.
ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు సోనియా పిలిపించారన్నారు. వైఎస్ వారసుని ఎంపికలో మేడమ్ గారిదే తుది నిర్ణయమన్నారు.
అయితే, ప్రధాని మన్మోహన్, వీరప్ప మొయిలీ, ఇతర సీనియర్ నేతలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారని కేవీపీ తెలిపారు. ఇంతకుమించి ఇతర విషయాలు ఏమీ మాట్లాడలేదని కేవీపీ రామచంద్రరావు వివరించారు.