ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించలేదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరరావు హైదరాబాద్లో మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జివి(కాకా) చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు.
తాను అధిష్టానానికే కట్టుబడివుంటానని తరచూ వైఎస్ తమతో అంటుండేవారని ఆయన అన్నారు. ఆయన తెలంగాణ అభివృద్ధి కోసమే ఆ ప్రాంతానికి చెందిన వారికే హోం శాఖ కేటాయించారని, దీనినిబట్టి చూస్తే తెలంగాణపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో, తమ ప్రాంత అభివృద్ధికి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని శంకరరావు అన్నారు.
ఇదిలావుండగా తాము తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరపున జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీకి నివేదిక అందించామన్నారు. గతంలో నెహ్రూ తెలంగాణపై వ్యక్తపరిచిన అభిప్రాయాలను తమ నివేదికలో పొందుపరిచామన్నారు. నెహ్రూ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని తాము కమిటీకి విన్నవించినట్లు ఆయన తెలిపారు.
కాగా కమిటీకి చెందిన సభ్యులందరూ తెలంగాణ ప్రాంతంలోని అన్ని మండలాల్లో తిరగి ప్రజల అభిప్రాయసేకరణ చేయాలని కూడా తాము వారికి సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.