తెలంగాణ ప్రాంతానికి చెందిన సబితా ఇంద్రారెడ్డి పేరుకు మాత్రమే రాష్ట్ర హోం మంత్రిగా ఉన్నారని, పాలనా పగ్గాలన్ని ఆంధ్రా పాలకుల చేతుల్లోనే ఉన్నట్టు తెలంగాణ ఐకాస కన్వీనర్ ఆచార్య కోదండరామ్ ఆరోపించారు. ఆయన హైదరాబాద్లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లో తెలంగాణ ఉద్యమయాత్రను చేపడుతామన్నారు.
ఇందుకోసం పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇకపోతే.. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న యువకులు, విద్యార్థుల అంతిమయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్ర హోం మంత్రిగా తెలంగాణ మహిళ ఉన్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు.
పేరుకు మాత్రమే ఆమె హోం మంత్రిగా ఉంటున్నారని, పాలనా పగ్గాలన్నీ ఆంధ్రా పాలకుల చేతుల్లో ఉన్నాయన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేయని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వబోమని ఆయన హెచ్చరించారు.
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఎదుట ఆ రెండు పార్టీలు తమ ద్వంద వైఖరిని విడనాడి ఒకే అభిప్రాయాన్ని వెల్లడించాలని కోదండరామ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత, ఏర్పాటుపై పది జిల్లాల వాసుల్లో అవగాహన కల్పించేందుకే ఉద్యమ యాత్రను చేపట్టనున్నట్టు చెప్పారు.