Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ భవన్ అమర వీరుల కుటుంబాలకు అంకితం: టీడీపీ

తెలంగాణ భవన్ అమర వీరుల కుటుంబాలకు అంకితం: టీడీపీ
, శుక్రవారం, 9 మార్చి 2012 (17:47 IST)
File
FILE
వచ్చే 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమనీ, వచ్చిన వెంటనే టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌ను అమర వీరుల కుటుంబాలకు అంకితమిస్తామని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు. తమ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణమే తెలంగాణ భవన్‌ను విక్రయించి వచ్చిన సొమ్మును అమర వీరుల కుటుంబాలకు అందజేస్తామని ఆయన తెలిపారు.

మోత్కుపల్లి శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు టీఆర్ఎస్‌కు ప్రభుత్వం స్థలం ఉచితంగా ఇచ్చిందన్నారు. ఆ స్థలంలో టీఆర్ఎస్ కార్పొరేట్ వ్యాపారాలు నిర్వహిస్తూ.. తెలంగాణ భవన్‌ను కార్పొరేట్ ఆఫీసుగా మార్చివేసిందని ఆయన దుయ్యబట్టారు.

ఈ భవన్‌లో రాజకీయాల కంటే.. కేసీఆర్, ఆయన కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాలే ఎక్కువగా సాగుతున్నాయని మోత్కుపల్లి ఆరోపించారు. అందువల్ల ప్రభుత్వం ఈ భవన్‌ను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక రాష్ట్ర సాధన పేరుతో ప్రజల సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని కేసీఆర్, ఆయన కుటుంబం బెదిరింపు ధోరణులతో వ్యాపారాలు చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu