తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు ఘటనకు పేలుడే కారణమా?
, గురువారం, 2 ఆగస్టు 2012 (12:04 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరు విజయమహాల్ సెంటర్ వద్ద రెండు రోజుల క్రితం తమిళనాడు ఎక్స్ప్రెస్లో జరిగిన ఘోర ప్రమాదానికి పేలుడే కారణమై ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తి చేసిన తర్వాతే అధికారికంగా ప్రకటించాలని వారు భావిస్తున్నారు. పేలుడు జరిగిందనడానికి కొన్ని కారణాలు సైతం వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా.. అగ్నికి ఆహుతైన ఎస్-11 బోగీ 45-49 బెర్తుల కింది భాగంలో బాగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఈ ప్రాంతంలోనే ఎక్కువ మంది మృతులు చనిపోయారు. 28 మంది మృతుల్లో 15 మంది ఈ బెర్తుల చుట్టుపక్కవారే ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో ఈ సీట్ల కింద ఏదైనా పేలుడు పదార్థాలు రవాణా చేసి ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు.. ఈ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై గురువారం, శుక్రవారం బహిరంగ విచారణ జరుపుతున్నారు. దినేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని కమిటీ విచారణ జరుపుతోంది. నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ఆఫీసర్ల రెస్ట్ హౌస్లో ఉదయం 10 గంటల నుంచి విచారణ ప్రారంభమైంది. తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై తమకు తెలిసిన వివరాలు చెప్పాలని అధికారులు కోరారు. ముఖ్యంగా.. ఎస్-11 బోగీలో విధులు నిర్వహించిన ట్రావెలింగ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ (టీటీఈ)ని విచారణకు పిలిపించారు. ఈ బోగీలో ఢిల్లీ నుంచి ముగ్గురు అనుమానితులు రిజర్వేషన్ టిక్కెట్ లేకుండా ఎలా ప్రయాణించారన్న దానిపై విచారణ అధికారులు కూపీ లాగుతున్నారు.