రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జాడ ఇంతవరకూ తెలియరాకపోవడంతో ప్రజలలో తీవ్రమైన ఆందోళ వ్యక్తమవుతోంది. తెల్లవార్లూ వైఎస్ ఆచూకి గురించి శుభవార్త వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నారు. తమ ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి సురక్షితంగా ఉండి ఉంటారనీ, అడవిలో ఎక్కడో చిక్కుబడిపోయి ఉంటారనీ ప్రజలు అంటున్నారు.
ఉదయం పదిగంటలకు ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జాడ లేకుండా పోయిందని తెలిసిన తర్వాత అధికారుల స్పందించిన తీరుపై ప్రజలు విమర్శిస్తున్నారు. వెనువెంటనే వైఎస్ ఆచూకి కనుగొనడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారనీ, తామే నల్లమలలోని చెట్టూ.. పుట్టా అన్నీ వెతికి రాజశేఖరుని తెచ్చుకుంటామని ఉద్వేగంగా చెపుతున్నారు.
మరోవైపు శ్రీశైలం బ్యాక్వాటర్లో చమురు జాడలు కన్పించినట్లు స్థానిక జాలర్లు సమాచారం అందించడంతో శ్రీశైలం నీటిలో హెలికాప్టర్ కూలిపోయి ఉంటుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.