Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్షణ.. క్షణం... పెరుగుతున్న "ప్రకాశం" నీటి మట్టం

క్షణ.. క్షణం... పెరుగుతున్న
, సోమవారం, 5 అక్టోబరు 2009 (13:57 IST)
కృష్ణా నదిపై విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం క్షణ.. క్షణం పెరుగుతోంది. ఎగువ రిజర్వాయర్ల నుంచి సముద్రంలోకి లక్షలాది క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో ప్రకాశం బ్యారేజి నీటిమట్టం సోమవారం గరిష్ట స్థాయి 21.2 అడుగులకు చేరింది. బ్యారేజ్‌లోకి ఇన్ ఫ్లో 10.60 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లోగా 10 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణా నది కరకట్టకు ఆనుకుని ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

కాగా, ప్రకాశం బ్యారేజ్ నిర్మించిన 54 ఏళ్ళ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున వరద నీరు రావడం ఇదే తొలిసారని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. వరద ఉధృతిగా ఉన్నప్పటికీ బ్యారేజ్‌కు ఎలాంటి ముప్పు లేదని వారు స్పష్టం చేశారు. దిగువ ప్రాంతాలకు మరింతగా వరద ముప్పు పొంచి ఉందని, అందువల్ల ఆ ప్రాంతాల వాసులు తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడం మంచిదని అధికారులు విజ్ఞప్తి చేశారు. వరద నీరు కారణంగా పది లక్షల మంది నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా.. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం క్రమేపీ తగ్గుతోంది. సోమవారం ఉదయానికి 891.69 అడుగుల ఎత్తున శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం నమోదై ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 7.32 లక్షల క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లోగా 13.74 లక్షల క్యూసెక్కులు ఉంది. అలాగే, నాగార్జునసాగర్ నీటిమట్టం 588 అడుగుల ఉంది. ఇన్ ఫ్లో 11.36 లక్షల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 10 లక్షల క్యూసెక్కులు ఉంది.

Share this Story:

Follow Webdunia telugu