కిరణ్ కుమార్ రెడ్డి: అలాగని సీమాంధ్రకి అనుకూలం కాదు..!
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన స్పందించారు. తనను సీమాంధ్రకు ముఖ్యమంత్రిగా నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాను కోరుకుంటున్న మాట నిజమేనని... అలాగని సీమాంధ్రకి అనుకూలం కాదని సీఎం కిరణ్ స్పష్టం చేశారు. మంగళవారం ముఖ్యమంత్రిని తెలంగాణ మంత్రులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవోల సభకు మీ మద్దతుందని, సీమాంధ్రకు మీరు అనుకూలంగా ఉన్నారని అందరూ అనుకుంటున్నారని టీ మంత్రులు ముఖ్యమంత్రితో అన్నారు. దీనికి సమాధానంగా సీఎం పైవిధంగా స్పందించారు. తాను ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రినని తనకి అందరూ సమానమేనని కిరణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణవాదుల సభకు మీరు మద్దతు తెలిపినప్పుడు మీ మనోభావాలను అర్థం చేసుకున్నాను. ఏపీఎన్జీవోలు సభ పెట్టుకుంటామంటే వారి మనోభావాలను అర్థం చేసుకున్నాను అని వివరణ ఇచ్చారు. రాష్ట్ర సమైక్యతే ముఖ్యమని ప్రాంతాల వారీగా విభజన తనకిష్టం లేదని, అందుకు గల కారణాలు సైతం కిరణ్ కుమార్ రెడ్డి టి. కాంగ్రెస్ మంత్రులకు వివరించినట్లు తెలుస్తోంది.