ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు, అధికార కాంగ్రెస్ పార్టీయే శకునిలా వ్యవహరిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత టి.దేవేందర్ గౌడ్ ఆరోపించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తెరాస, కాంగ్రెస్లు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడుతున్నాయన్నారు. అంతటితో ఆగని ఈ రెండు పార్టీలు తెలంగాణలో బీసీలకు అండగా ఉన్న తమ పార్టీని భూస్థాపితం చేసే కుట్రలను పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. ఇలాంటి వారిని తెలంగాణ ప్రజలు సాంఘిక బహిష్కరణ చేస్తే తప్ప బడుగు వర్గాలకు న్యాయం జరగదన్నారు.
తెలంగాణలో అమలులో ఉన్న పటేల్-పట్వారీ వ్యవస్థను తెదేపా రద్దు చేయకపోతే సామాజిక పరిస్థితులు ఇంకెంత దయనీయంగా ఉండేవో ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణ రణభేరి సభను అడ్డుకున్న వారు తెలంగాణ ద్రోహులేనని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజల పక్షం వహించాలే తప్ప పార్టీల పక్షం వహించకూడదని ఆయన హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము పోరాడుతుంటే, తమ సభలను అడ్డుకోవడం ఎంత వరకు న్యాయమన్నారు.