రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ క్రాష్ కావడంతో బుధవారం దుర్మరణం పాలైనారు. ఆయన పార్థీవ శరీరాన్ని కర్నూలులో పోస్ట్మార్టం చేసిన అనంతరం హైదరాబాద్కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆర్థిక మంత్రి రోశయ్య విలేకరులతో మాట్లాడుతూ...ముఖ్యమంత్రి పార్థీవ శరీరాన్ని కర్నూలునుంచి హైదరాబాద్కు గురువారం సాయంత్రం తరలిస్తారని, ప్రజల సందర్శనార్థం రాజధానిలోని లాల్బహాదుర్ స్టేడియంలో ఉంచనున్నట్లు ఆయన వెల్లడించారు.
శుక్రవారం మధ్యాహ్నం వైఎస్ పార్థీవ శరీరాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరిలిస్తామని ఆయన పేర్కొన్నారు. అతి చిన్న వయసులోనే వైఎస్ ఎన్నో శిఖరాలు అధిరోహించాడని, మంచి పరిపాలనాదక్షుడని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. వైఎస్ మృతి చెందాడన్న వార్తను తాను జీర్ణించుకోలేక పోతున్నానని ఆవేదనతో కంట తడిపెట్టారు. ఎంతో సన్నిహితంగా తాము ప్రతి పనిలో కలిసి మెలిసి పనిచేసామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
వైఎస్ మరణం యావత్ భారత దేశాన్ని కంటతడి పెట్టించిందని, విధి బలీయమైందని, ఈ సంఘటన చాలా దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్మం రెండు గంటలకు మంత్రివర్గ సహచరులతో సమావేశమై సంతాపం ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.