Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ స్పృహలోనే ఉన్నారు, ఆందోళన చెందకండి: వైద్యులు

కేసీఆర్ స్పృహలోనే ఉన్నారు, ఆందోళన చెందకండి: వైద్యులు
, శనివారం, 5 డిశెంబరు 2009 (17:10 IST)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గత ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావు స్పృహలోనే ఉన్నారని నిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

కేసీఆర్ కోమాలోకి వెళ్ళారంటూ వచ్చిన పుకార్లు నగరంలో షికార్లు చేశాయి. దీంతో తెరాస కార్యకర్తలు, పలు విద్యార్థి సంఘాలు నిమ్స్ వైపుకు తరలివెళ్ళాయి. ఈ నేపథ్యంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాదరావు విలేకరులతో మాట్లుడుతూ... ప్రస్తుతం కేసీఆర్ స్పృహలోనే ఉన్నారని పుకార్లను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.

స్పృహలోనే ఉన్న కేసీఆర్ బాగా నీరసంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ శరీరంలో సోడియం ఒక్కటే తక్కువగా ఉందని, మిగతా ఇబ్బందులు తగ్గుతున్నాయని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

కేసీఆర్ ఆరోగ్యం విషమించిందన్న వార్తలు మీడియాలో రావడంతో శనివారం మధ్యాహ్నానికి తెలంగాణ విద్యార్థులు వేలాదిగా నిమ్స్ కు తరలి వచ్చారు. నిమ్స్‌లోకి చొచ్చుకుపోయేందుకు వారు యత్నించారు. విద్యార్థుల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ క్రమంలో విద్యార్థులు, తెరాస శ్రేణులు పంజాగుట్ట చౌరస్తా నుంచి అమీర్ పేట చౌరస్తా వరకూ భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను ధ్వంసం చేశారు. తెరాస శ్రేణుల విధ్వంసకాండ నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలో దింపారు.

తెరాస శ్రేణుల ఉద్యమం అదుపు తప్పడంతో నగరంలోని ఆబిడ్స్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూ విధించినట్లైంది. కాగా, నిమ్స్ పరిసరాల్లో ఈ రోజు నుంచి 48 గంటలపాటు 144 సెక్షన్ విధించినట్లు నగర పోలీసు కమిషనర్ ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu