సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. ఆ తర్వాత రాజంపేటకు తరలించారు. హైదరాబాద్ నగరంలోని పోసాని నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీ అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషనులో ఉన్నారు.
పోసాని అరెస్టు నేపథ్యంలో వైకాపా నేతలు నోటికి పని చెప్పారు. ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్లతో పాటు వారి కుటుంబ సభ్యులను బండ బూతులు తిట్టడాన్ని వారు బహిరంగంగా సమర్థిస్తూ పోసాని అరెస్టును ఖండిస్తున్నారు.
ఈ క్రమంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పోసాని భార్య కుసుమ లతకు ఫోన్ చేసి పరామర్శించారు. పోసానికి పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ధైర్యం చెప్పారు. దేవుడు అంతా చూస్తున్నాడు. "మీరు ధైర్యంగా ఉండండి. మీకు అందరం తోడు ఉంటాం" అని అన్నారు.
వైకాపా న్యాయవాది పొన్నవోలు సుధాకరె రెడ్డి సహా నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించామని చెప్పారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదని ఆయన జోస్యం చెప్పారు.
మరోవైపు, అనంతపురానికి చెందిన జనసేన నేత జోగిమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది. 196, 353(2), రెడ్ విత్ 2(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోసానిపై ప్రస్తుతం 11 కేసులు నమోదైవున్నాయి.