సమాజంలో బాలికలపై వేధింపులు, అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లా, ధర్మవరంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించకపోతే చంపేస్తానంటూ ఓ యువకుడు బాలికను తరచుగా వేధించడంతో తీవ్ర మస్తాపానికి గురైన ఆమె శుక్రవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది.
హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బాలిక రోజుకు స్కూలుకు వెళ్తున్న సమయంలో యువకుడు వెంటపడుతూ ప్రేమించాలని, లేకుంటే చంపేస్తానని వేధించేవాడని బాలిక తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసులు బాలిక ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.